పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్
* పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలి
* మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..?
భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావటం వల్ల భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరగనుందని రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. గోదావరి వరదలు ప్రతి ఏటా భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తుతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిర్మాణంతో ఈ వరదల తీవ్రత పెరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం కాపర్ డ్యాం వల్ల ప్రజలు ఇప్పటికే గృహ నష్టాలు, జీవనోపాధితో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. పోలవరం వల్ల ఉత్పన్నమయ్యే బ్యాక్ వాటర్ ముంపు పట్టణ అభివృద్ధికి అడ్డంకి మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్రం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భద్రాచలానికి తిరుగులేని నష్టం సంభవిస్తుందని ఆయన అన్నారు. చారిత్రిక నేపథ్యం గల భద్రాచలం శ్రీరాముని దేవాలయం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత విడాలన్నారు.
….పరిష్కారం చేయవలసిన బాధ్యత కేంద్రానిదే….
పోలవరం జాతీయ ప్రాజెక్ట్గా కేంద్రం స్వయంగా గుర్తించినందున దాని ప్రభావం వల్ల కలిగే ప్రతి సమస్యకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బ్రిటాస్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. కాని పునరావాసం ఇంకా పూర్తికాలేదు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత నుంచి తప్పించుకోవడం కేంద్రానికి సాధ్యం కాదు అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ వ్యయ భారం పునరావాసం పరిహారం చెల్లింపులు రక్షణ గోడల నిర్మాణం అన్నీ కేంద్రం తీసుకోవాల్సిన చర్యలని బ్రిటాస్ స్పష్టం చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలానికి ఇవ్వాలి
భద్రాచలానికి అత్యంత సమీపంలో ఉన్న ఐదు గ్రామపంచాయతీలు ఇప్పటికీ వేరే మండలాల్లో ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిటాస్ అన్నారు. రోజువారీ పనులు విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల కోసం ఈ గ్రామాల ప్రజలు భద్రాచలంపైనే ఆధారపడుతున్నప్పటికీ పరిపాలనా పరంగా వెనుకబడి పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గ్రామాల విలీనం ద్వారా అభివృద్ధితో పాటు, ప్రభుత్వ పథకాలు చేరుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే 5 సెకండ్లలో ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణలో కలపవచ్చని అన్నారు.అలాగే పట్టణ విస్తరణ సహజంగా జరుగుతూ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజల డిమాండ్లను గౌరవిస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన గట్టిగా కోరారు.
స్వాతంత్ర వేడుకల్లో ఆర్ఎస్ఎస్ ను పోగడడం ప్రధాని బాధ్యత రాహిత్యం
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన సందర్భమని అలాంటి వేదికపై ప్రధానమంత్రి ఒక్క సంస్థను మాత్రమే పొగడటం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని బ్రిటాస్ విమర్శించారు. దేశ స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు రైతు కూలీలు విద్యార్థులు మహిళలు అందరూ ప్రాణత్యాగాలు చేశారు. అనేక విప్లవకారులు ఉరిశిక్షలు ఎదుర్కొన్నారు. అలాంటి సందర్భంలో కేవలం ఆర్ఎస్ఎస్ను మాత్రమే ప్రస్తావించడం చరిత్రను వక్రీకరించడం అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని స్వాతంత్ర దినోత్సవ వేదికపై ఇచ్చే ప్రతి మాట దేశానికి మార్గదర్శకం కావాలని కానీ అందుకు భిన్నంగా స్వాతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధంలేని, బ్రిటిష్ వారికి లొంగిపోయి క్షమాపణలు కోరిన RSS ను గొప్ప సంస్థగా పొగడడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని బ్రిటాస్ స్పష్టం చేశారు.
మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..?
భారత అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడిన బ్రిటాస్ ప్రధాని మోడీపై ఎద్దేవా చేశారు. మోడీ ట్రంప్తో స్నేహం పెంచుకున్నానని చెబితే ఆ స్నేహం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడకపోతే దాని అర్ధం ఏమిటి ఇప్పటికీ అమెరికా భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తోంది. రైతులు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. నిజమైన స్నేహం ఉంటే ఈ సుంకాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ మోడీ ట్రంప్ సంబంధం మాటలకే పరిమితమైందని అది ప్రజలకు లాభం చేకూరలేదని స్పష్టమవుతోంది అని బ్రిటాస్ వ్యాఖ్యానించారు.
పోలవరం బ్యాక్ వాటర్ నుంచి భద్రాచలం రక్షణ, పునరావాస సమస్య, గ్రామాల విలీనం, స్వాతంత్ర దినోత్సవం బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ఇలా పలు అంశాలపై జాన్ బ్రిటాస్ సమగ్రంగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుంది. అందువల్ల కేంద్రం బాధ్యతగా ముందుకు రావాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ పత్రిక సమావేశంలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ఏజే రమేష్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య ఎం.బి నర్సారెడ్డి పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి,జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీ కృష్ణ బండారు శరత్ బాబు పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, కుంజ శ్రీనివాస్, ఎస్ భూపేంద్ర, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..